Welcome to the BLISSFUL journey

శ్యామల గారు అనుభవాలు

0

ఓం శ్రీ గురుభ్యోనమః
పూజ్య గురువులు శ్రీ భోగనాథ మహర్షి గారికి, మహావతార్ బాబాజీ గారికి మరియు ప్రత్యక్ష గురువులైన శ్రీ ఆత్మానందమయి అమ్మగారికి నా నమస్కారములు మరియు కృతజ్ఞతలు.
నాకు ఆత్మానందమయి అమ్మగారితో 2015లో పరిచయ భాగ్యం కలిగింది. నాకంటే ముందు ఆత్మానందమయి అమ్మగారికి మా వారు శిష్యులు.
మా వారు ఆంధ్రప్రదేశ్ లో ‘డి ఐ జి’ గ పనిచేస్తున్నారు.
2014 లో మా వారు తిరుపతిలో ఒకరోజు అలా వెళుతుండగా కొన్ని బ్యానర్స్ చూడటం జరిగింది. అమ్మగారు తిరుపతిలో గురుపౌర్ణమి రోజున మహతి ఆడిటోరియంలో ఒక ప్రోగ్రాం నిర్వహించబోతున్నారు అనేది ఆ బ్యానర్ యొక్క సారాంశం. అయితే ఆ బ్యానర్స్ ని తదేకంగా చూస్తున్న మా వారికి ఒక అద్భుతమైన అనుభవము ఎదురయింది. ఆ బ్యానర్స్ మీద వున్న శ్రీ భోగనాథ మహర్షిగారి కంటి నుండి ఒక కాంతి రేఖ వచ్చి మా వారి కంటికి తగిలింది.
దానితో ఈ కార్యక్రమానికి తాను కూడా అటెండ్ కావాలి అని నిర్ణయించుకున్నారు. కానీ పనుల ఒత్తిడిలో పడి మర్చిపోయారు. పని మీద హైదరాబాద్ కు కూడా వచ్చేసారు.
వచ్చేశాఖ సడన్ గా గురుపౌర్ణమి రోజు ఉదయం ఈ ప్రోగ్రాం గుర్తుకు వచ్చి ,వెంటనే ఫ్లైట్ బుక్ చేసుకుని తిరుపతి వెళ్లిపోయారు. వెళ్ళగానే ప్రోగ్రాం గురించి ఎంక్వయిరీ చేస్కుని సాయంత్రం గురు పౌర్ణమి పబ్లిక్ క్లాస్ కు అటెండ్ అయ్యారు.
ఆరోజు చాలా బాగా మెడిటేషన్ కుదరడం దాని ద్వారా అత్యంత ఆనందాన్ని పొందడం జరిగింది. ఆయన క్లాస్ పూర్తి చేస్కుని అమ్మగారిని కలిసి తిరిగి వచ్చేసారు. ఈ విధంగా నాకంటే ముందు మా వారికి అమ్మగారితో పరిచయ భాగ్యం కలిగింది.
2015 ఆగస్టు నెలలో మా అత్తగారు చనిపోవడం ,అక్టోబర్ నెలలో మా మామగారు చనిపోవడం అనేది మమ్మల్ని చాలా దుఖానికి గురిచేసింది. ఏంటిలా సడన్ గా ఇద్దరు వరుసగా మాకు దూరం అయ్యారు అనే భాద మమ్మల్ని ముంచేసింది. సరిగ్గా ఆ సమయంలోనే మా తల్లిగారు కూడా అస్వస్థతకు లోనయ్యారు. వారిని హాస్పిటల్ లో జాయిన్ చేయడం వారికి బైపాస్ సర్జరీ చేయడం జరిగింది. మనిషి వీక్ గా ఉండటం వల్ల ఆవిడ ఆపరేషన్ కు తట్టుకోలేకపోయారు. 45 రోజులు హాస్పిటల్లోనే వుంచిన పరిస్థితి. ఆ స్థితిలో అమ్మగారు మా ఇంటికి వచ్చి ఒక గ్రూపు మెడిటేషన్ క్యాంపు పెట్టారు. తర్వాత 49 రోజులు మెడిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించమని మా తల్లి గారికి ఏమీ జరగదని అంతా మంచే జరుగుతుంది అని మాకు భరోసా ఇచ్చారు. అమ్మగారి ఆద్వర్యంలోనే గ్రూప్ మెడిటేషన్ కార్యక్రమం ప్రారంభించడం, 49 రోజులు పూర్తవకుండానే మేము ఆనంద ఆశ్చర్యాలకు గురయ్యే విధంగా మా తల్లిగారి ఆరోగ్యము నార్మల్ కండిషన్ కు రావడం.ఇదంతా ఆత్మానందమయి అమ్మగారి ఆశీర్వచనఫలమే అని నా నమ్మకం.
49 రోజుల మెడిటేషన్ కార్యక్రమం ముగింపుకు కూడా అమ్మగారు రావడం మా అదృష్టం.
ఈ సంఘటనలతో అమ్మగారు ఆద్వర్యంలోని మెడిటేషన్ బృందంలో నేను ఒక సభ్యురాలిగా ఆవిడ శిష్యురాలిగా మారిపోయాను. అప్పటి నుండి నాకు ఏ సమస్య వచ్చినా అమ్మగారికి నా మనసులోనే చెప్పుకోవడం అలవాటైపోయింది. నేను ఏదైనా మానసిక ఒత్తిడికి లోనయినప్పుడు ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోవడంలో సందిగ్ధావస్థకు గురి అయినప్పుడు అమ్మగారు నా పక్కనే ఉండి నా సమస్యను పరిష్కరించడం అనేది నాకు కలిగిన అద్భుతమైన అనుభవం. ఒక్కొక్కసారి అయితే నాకు సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్య గురించి నాకు తప్ప ఎవరికీ తెలియని సందర్భంలో కూడా అమ్మ గారు పంపిన మనుషులు ద్వారానో వాళ్లు పంపే మెసేజ్ ద్వారానో సమస్య తొలగిపోయె ద్వారాలు తెరుచుకున్న సందర్భాలు అనేకం. అమ్మ వడిలో తొమ్మిది నెలలు మాత్రమే ఉంటాము ఎంతో భరోసాగా ప్రశాంతంగా. అయితే అమ్మగారి ప్రపంచంలో తల్లి కడుపులో బిడ్డకు కలిగే భద్రత, నిశ్చింత , ప్రశాంతత నాకు కూడా దొరకడం ఇది అనిర్వచనీయమైన అనుభవం. నాకు దొరికిన అద్భుతమైన అదృష్టం.
ఓం శ్రీ గురుభ్యోనమః

Share.

Comments are closed.