Month: January 2019

మరుసటి రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి వెంట వెంటనే తయారై కాలి నడకనే మా రూమ్ దగ్గర నుండి ఆడిటోరియం చేరాం. ఉదయం 6:00 గంటలకు ఒక సెషన్ తిరిగి 7:00 గంటలకు మరొక సెషన్ కలిపిరెండు సెషన్లు ఏర్పాటు చేశారు. ఎంతో శ్రద్ధగా అక్కడి వారంతా అమ్మగారి వద్ద దీక్షను పొంది, ధ్యానానికి సంభందించిన అనేక ప్రశ్నలు వేశారు. DRDO ఉద్యోగులు, శాస్త్రవేత్తలు దీక్షా శిబిరానికి హాజరయ్యారు.సుషుమ్న క్రియా యోగ వైశిష్ట్యం, దీక్ష, సుషుమ్న క్రియా యోగంలోని శాస్త్రీయ విజ్ఞానం  ఈ మూడు కార్యక్రమాలతో రెండు సెషన్లు ముగిసాయి. కార్యక్రమం ముగిసాక అమ్మగారు రూమ్ వరకునడుస్తానన్నారు. అమ్మగారికి నడక అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ప్రకృతి శోభ నిండి ఉన్న ప్రదేశాలంటే చాలా ఇష్టపడతారు. అమ్మగారి వెనుకనే కొందరం ఉన్నాం. అమ్మగారు అక్కడి పర్వత సౌందర్యాన్నితదేకంగా చూస్తూ..నెమ్మదిగా నడుస్తున్నారు. మేము నడుస్తున్న మార్గం మధ్యలో చిన్న చిన్న పూ బాలలు అనేక రంగుల్లో కనిపించాయి. అమ్మగారు ప్రతీ పువ్వును తిలకిస్తూ మురిసిపోతున్నారు. ఆచిన్న చిన్న పూల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, ముగ్ధులవుతూ….. ఒక పుష్పాన్ని పసి పాపాయిని ముద్దాడుతున్నట్లుగా పట్టుకుని ఆనందంగా నవ్వుతూ నడిచారు. వెనకనే వస్తోన్న మా మదిలో మెదిలినభావన. ఈ రోజు ఆ పువ్వు ఎంత అదృష్టం చేసుకుందో….! అమ్మగారి కర స్పర్శతో దాని జీవితం ధన్యం అయింది! అనిపించింది. ఆ రోజుకు ధ్యాన కార్యక్రమాలు ముగిసాయి. అమ్మగారు అందరినివిశ్రమించమన్నారు. మధ్యాహ్నం వేళ కాస్త విశ్రాంతి తీసుకొని 4 గంటల ప్రాంతంలో మరొక చోటికి బయలు దేరాం.

అమ్మగారు ఒక అరగంటలో తయారై, మరుసటి రోజు జరగబోయే దీక్షా కార్యక్రమ ప్రణాళికను చర్చించేందుకు అందరినీ రమ్మన్నారు. ధ్యాన శిబిరాలు నిర్వహించేటప్పుడు అమ్మగారే స్వయంగా అందరికీ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రతీ విషయాన్ని అత్యంత సూక్ష్మంగా వివరించి 100% నైపుణ్యంతో, భావంతో చెయ్యమని శిష్యులకు చెబుతారు అమ్మగారు. భావం లేకుండా, పూర్తి దృష్టి లేకుండా గురువులు అప్పగించిన పనిని చెయ్యాలనుకోవటం కత్తితో చెలగాటం ఆడటం వంటిది. తెలిసో తెలియకో చిన్నపాటి పొరపాట్లు అలసత్వం కారణంగాజరిగినప్పుడు పెద్ద ఇబ్బందులే ఎదుర్కొన్న అనుభవాలు మా బృందంలో అందరికీ ఉన్నాయి. గురువులు మనకి అప్పగించే పనులు వారే స్వయంగా జరిపించుకోలేక కాదు, శిష్యుల ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమే చిన్న చిన్న పనులు అప్పగిస్తుంటారు. ఆ పనిలోనే శిష్యుల ఆధ్యాత్మిక పరిణతిని గ్రహించ గలుగుతారు గురువులు. అందుకే అందరం గురువులిచ్చిన పనిని భావంతో నిర్వర్తించాలని శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఆధ్యాత్మికంగా భగవద్ సాంగత్యాన్ని పొందిన గురువుల సమక్షంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ విషయాలుఅమ్మగారు ఏ రోజు ఆదేశాలుగా చెప్పలేదు. కానీ కొన్ని అనుభవాలే గుణ పాఠాలు నేర్పాయి. పరమాత్మతో సమానమైన గురువులు ఏ పనినైనా ఎంతో సులువుగా జరిపించుకోగలరు. కానీ శిష్యుల కర్మల క్షయం కోసం, శిష్యులకు ఉన్నత గతులను ప్రసాదించటం కోసం వారి విశ్వ కార్యంలో మమల్ని సైతం భాగస్వాములను చేశారు అమ్మగారు. గీతలో శ్రీ కృష్ణుడు బోధించినట్లు, ప్రతిఫలాపేక్ష లేకుండా మన ధర్మాన్ని గురువు నిర్దేశంలో నిర్వహించగలిగితే, అది తప్పక మన ఆధ్యాత్మిక పురోగతికి కారణం అవుతుంది. ఇలా ఉండటమే మంచిశిష్యుల లక్షణం కూడా.