Welcome to the BLISSFUL journey

అడ్డూరి మంగమ్మ గారు అనుభవాలు

0

వైజాగ్ వాస్తవ్యులు శ్రీదేవిగారి తల్లిగారు మంగమ్మగారు.వీరు2010 మార్చి నుండి మన సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన చేసుకుంటున్నారు.వీరు ధ్యాన సాధనలోకి రాకపూర్వం చాలా సంవత్సరాలుగా హై బీపీతో,షుగర్ వ్యాధితో బాధపడేవారు. అంతేకాక నాలుగు,ఐదుసార్లు వీరికి మైల్డ్ హార్ట్ ఎటాక్ కూడా వచ్చింది.ఎప్పుడూ చాలా నీరసంగా మంచం మీదే ఉండేవారు, భోజనం కూడా సరిగ్గా చెయ్యలేక పోయేవారు.వారంలో కనీసం మూడు నాలుగసార్లు వివిధ డాక్టర్ల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. అంతేకాక వారానికి ఒక్కసారైనా నీరసంగా ఉండటం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ ఉండేవారు.కుటుంబ సభ్యులు అందరూ కూడా వారు తల్లి తమతో ఎంతో కాలం ఉండకపోవచ్చు అని బాధ పడుతూ ఉండేవారు.ఇలా ఉండగా గోరుచుట్టు మీద రోకలి పోటు చందాన వారికి రొమ్ములో గడ్డలు ఏర్పడి అవి కేన్సర్ గడ్డలేమో అని అనుమానంతో డాక్టర్స్ ఆపరేషన్ చేసి రెండు రొమ్ములూ తొలగించారు.ఇటువంటి పరిస్థితుల్లో వారికి వారి కూతురు శ్రీదేవిగారి ద్వారా సుషుమ్న క్రియా యోగ ధ్యానము పరిచయమయ్యింది.వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ధ్యానం వల్ల ఆరోగ్యస్థితి చేకూరుతుందా అని నమ్మలేక పోయారు.ధ్యానము మానసిక ప్రశాంతతకు కదా? మరి శారీరక రుగ్మతలు కూడా నయం అవుతాయా? అని సందేహము వ్యక్తం చేశారు.కానీ శ్రీదేవిగారు మీరు సాధన చెయ్యండి అమ్మా! మనకు భాగ్యం ఉంటే మీకు ఆరోగ్యం కుదుట పడుతుంది అని చెప్పడంతో వారు ధ్యాన సాధన మొదలు పెట్టారు.అదేమిటో కానీ మంగమ్మగారు మొదటి రోజు నుండే పూర్తి విశ్వాసంతో అమ్మగారి యందు శరణాగతితో సాధన చెయ్యసాగారు.కొద్ది రోజులలోనే ధ్యానం యొక్క ప్రభావం వల్ల మంగమ్మగారికి నీరసం తగ్గింది, ఉత్సాహం హెచ్చింది మంచం మీదనుంచి లేచి తిరగగలిగారు.భోజనం కూడా హితవుగా స్వీకరించ గలిగారు.వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది ఆశ్చర్యకర లీలగా గోచరించింది.ఇలా ఉండగా రొమ్ము ఆపరేషన్ తాలూకు రిపోర్ట్స్ చూసి డాక్టర్స్ వారికి కీమోథెరపీ ఇవ్వాలి అని చెప్పారు.కుటుంబ సభ్యులు కొంత గాబరా పడ్డారు. డబ్బై ఏళ్ల వయసులో వీరు కీమోథెరపీ తట్టుకుంటారో లేదో అని బాధపడ్డారు.కానీ గురువుల మీద భారం వేసి ట్రీట్మెంట్ మొదలు పెట్టారు.ఆశ్చర్యంగా ఒక్క కాంప్లికేషన్ కూడా రాలేదు.అంత వయసులో కూడా కీమోథెరపిని చక్కగా తట్టుకున్నారు మంగమ్మగారు.కీమోథెరపీ అనేది శరీరానికి విష ప్రయోగం చేయడం లాంటిది.దానివల్ల చాలా దుష్పరిణామాలు ఉంటాయి.కానీ కేన్సర్ పేషెంట్స్ కు ఇది ఇవ్వక తప్పదు.కీమోథెరపీ తీసుకునేటప్పుడు తెల్ల రక్తకణాలు క్షీణించడం వల్ల తీవ్ర స్థాయిలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి.ఎర్రరక్త కణాలు తగ్గిపోవడం వల్ల రక్త హీనత కలుగుతుంది.వీరికి మద్య మద్యలో రక్తం ఎక్కించుకోవలసిన పరిస్థితి వస్తుంది.అలానే అన్న వాహిక మొత్తం అంటే నోటి నుండి మొదలై కడుపు,పేగులు అంతా కూడా పొక్కిపోతుంది.ఆహారం స్వీకరించ లేకపోతారు.కడుపులో మంట, నొప్పితో భరించ లేనటువంటి బాధ వల్ల నరకము అనుభవిస్తు ఉంటారు. జుట్టు కూడా ఊడిపోతుంది ఇది మానసికంగా కృంగదీస్తుంది.ఆడవారిలో అయితే జననేంద్రియాలలో కురుపులు పొక్కులు, ఇన్ఫెక్షన్ వచ్చి నరకయాతన అనుభవిస్తారు.పైన చెప్పిన ఈ కాంప్లికేషన్స్ అన్ని కూడా షుగర్ పేషెంట్స్ లో ఇంకా తీవ్రస్థాయిలో ఉంటాయి. అంతే కాదు ఒక్కోసారి ఇన్ఫెక్షన్ ఇంకా హెచ్చు స్థాయిలో ఉండి, సెప్టిసీమియాకి దారి తీసి ప్రాణహాని కూడా కలిగించవచ్చు.వయోభారము,షుర్ వ్యాధి,హార్ట్ ఎటాక్ ఇవన్నీ కూడా ఈ కాంప్లికేషన్స్ ని,రిస్క్ ని ఎన్నోరెట్లు పెంచుతాయి.అలాంటి వారిలో చాలా మంది ఈ కీమో థెరపీ తట్టుకోలేక మధ్యలోనే ఆపేస్తారు. కాని మంగమ్మగారు ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నా..ఏ బాధ లేకుండా చక్కగా కీమోథెరపీ మొత్తం కంప్లీట్ చేసుకోగలిగారు అంటే నిజంగా ఇది ఒక అద్భుతం. ఇది కేవలం మన పరబ్రహ్మ ఆత్మానందమయి అమ్మగారి కరుణా కటాక్షం వల్లే ఇటువంటి అద్భుత లీలలు సాధ్యం అవుతాయి. అంతే కాదు అసలు మంచము మీద నుంచి కూడా లేవలేని స్థితిలో ఉన్న వారు నాలుగు నెలలు సాధన చేసిన తరువాత, ఆ సంవత్సరం రామేశ్వరంలో జరిగిన గురు పూజకు కూడా వచ్చి గురు పూజ చేసుకుని గురుమాత ఆశీస్సులు నేరుగా అందుకున్నారు.అంతే కాకుండా వీరు ఒక బృందంగా వచ్చారు.ఈ బృందం అంతా కూడా చిన్న మిని బస్సులో చుట్టు పక్కల ఉన్న పళని, కుట్రాలం,మదురై వంటి ప్రదేశాలన్నీ సందర్శించి ఒక పది రోజులు ఒక తీర్థ యాత్రలాగా సాగించి తిరిగి విశాఖపట్నం చేరుకున్నారు. మరి శ్రీదేవిగారి తల్లిగారు ఎటువంటి అనారోగ్యము కానీ, నీరసం కానీ లేకుండా అందరిలానే ఎంతో ఉత్సాహంగా ,ఆరోగ్యంగా ఈ యాత్రని సంపూర్ణం చేసుకోగలిగారు.ఇది మరి మన గురువుల లీల కాకపోతే మరి ఏమిటనుకోవాలి.అలా మంగమ్మగారు దిన దినాభివృద్ధి చెందుతూ ఈ రోజు అంటే డెబ్బైతొమ్మిది సంవత్సరాల తరువాత కూడా ఎంతో ఆరోగ్యంగా,ఉత్సాహంగా, ఆనందంగా…వారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా అమ్మగారి ఆశీస్సులు అందుకుంటూ సాధన సాగిస్తున్నారు.
ఓం శ్రీ గురుభ్యోనమః

Share.

Comments are closed.